తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 9:16 PM IST

Updated : Mar 9, 2024, 11:07 PM IST

ETV Bharat / bharat

ఎలక్షన్​ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా- లోక్​సభ ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం!

Election Commissioner Resignation : లోక్​సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల కమిషనర్ అరుణ్​ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు.

Election Commissioner Resignation
Election Commissioner Resignation

Election Commissioner Resignation : దేశంలో లోక్​సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు భారత ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్​ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో మూడేళ్లు పదవీకాలం ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుణ్ గోయల్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపగా, ఆమె ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఒక్క రాజీవ్ కుమారే!
అయితేకేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు ఉంటారు. అయితే అరుణ్‌ గోయల్‌ రాజీనామా కంటే ముందే సంఘంలో ఓ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేయడం వల్ల చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మాత్రమే మిగిలారు. అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణతో కొత్త కమిషనర్ ఎంపిక కోసం కమిటీ రెండు రోజుల క్రితం సమావేశం కావాల్సి ఉండగా, వాయిదా పడింది.

2027 వరకు అరుణ్ పదవీ కాలం
Arun Goel Resignation : అరుణ్ గోయల్ 2022 నవంబర్ 21వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషనర్​గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్​గా ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ గతంలో భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అరుణ్ గోయల్ రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఎన్నికలకు ముందు!
లోక్​సభ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్​ సమాయత్తమవుతున్న తరుణంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్- మే నెలల్లో జరిగే ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు ఈసీ బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పటికీ, ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దేశవ్యాప్తంగా భద్రతా సిబ్బంది మోహరింపు, తరలింపుపై కేంద్ర హోంశాఖ, రైల్వే అధికారులతో ఎన్నికల సంఘం శుక్రవారం భద్రతా సమావేశం నిర్వహించింది.

కశ్మీర్ పర్యటన అయ్యాక!
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కూడా 2024లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సి ఉంది. 2019లో లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ను మార్చి 10న ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి, ఫలితాలను వెల్లడించింది. అయితే జమ్మకశ్మీర్‌లో పర్యటన ముగిశాక శుక్రవారం ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Last Updated : Mar 9, 2024, 11:07 PM IST

ABOUT THE AUTHOR

...view details