Delhi CM Selection Strategy : భారతీయ జనతా పార్టీ- బీజేపీ కొత్త ఒరవడిని కొనసాగిస్తూ దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. ఈ ఎంపిక వెనుక అనేక రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడం, దిల్లీలో పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మహిళా ఓటర్లపై గురి
దిల్లీలో మహిళా ఓటర్లు దాదాపు 46 శాతం మంది ఉన్నారు. వారు ఎన్నికలల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఆప్, బీజేపీ మహిళా ఓటర్లపై వరాల జల్లు కురిపించాయి. ఆప్ మహిళలకు నెలకు రూ.2100 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ కూడా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక భరోసా ఇస్తామని వాగ్దానం చేసింది. ఈ క్రమంలో రేఖా గుప్తాను సీఎంని చేయడం ద్వారా తమ పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ వ్యూహం రచించింది. అలాగే మహిళా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని కమలదళం ప్లాన్ చేసింది.
బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాలు
దిల్లీ సీఎంగా రేఖా గుప్తాను నియమించడం వెనుక బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి. దిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను నియమించడం వల్ల బీజేపీపై నారీమణులకు మరింత నమ్మకం పెరుగుతుందని కమలం పార్టీ భావిస్తోంది.