Defence Acquisition Council Meeting Highlights : రూ.లక్షా 45,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. నేవీ, ఆర్మీ, వాయుసేన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఈ మేరకు మంగళవారం ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ ఆమోదం తెలిపిన వాటిలో ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లు, ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్, డోర్నియర్-228 ఎయిర్క్రాఫ్ట్ నెక్ట్స్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ అండ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెస్సెల్స్తో పాటుగా వివిధ ఆయుదాల కొనుగోళ్లకు అనుమతులు లభించాయి.
భారత సైన్యంలోని ట్యాంక్ ఫ్లీట్లను ఆధునీకరించడానికి ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (ఎఫ్ఆర్సీవీఎస్) కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ అనుమతి లభించింది. దీంతో పాటుగా వాయుసేనకు సంబంధించి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్ల సేకరణకు సైతం అనుమతిచ్చింది. ఇది వైమానిక లక్ష్యాన్ని గుర్తించి ట్రాక్ చేయడం సహా ఫైరింగ్ సమస్యలను తీరుస్తుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ పరికరాన్ని ఆర్మర్డ్ వెహికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసినట్లు తెలిపింది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను పెంపొందించేందుకు సైతం మూడు ప్రాజెక్టులకు డీఏసీ అమోగం లభించింది.