తెలంగాణ

telangana

అప్పు ఇచ్చిన మహిళ తల్లి హత్య- ముక్కలుగా నరికి కాలువలో పడేసిన జంట - Woman Murdered

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 7:46 PM IST

Couple Cuts Woman Into Pieces : కుమార్తె వద్ద తీసుకున్న అప్పును తీర్చేందుకు ఆమె తల్లిని ఏకంగా హత్య చేసింది ఓ మహిళ. అనంతరం భర్తతో కలిసి బాధితురాలి మృతదేహాన్ని ముక్కలుగా నరికి చేసి కాలువలో పడేసింది. చివరకు పోలీసులకు చిక్కి కటాకటాల పాలైంది. తమిళనాడులో జరిగిందీ ఘటన.

Couple Cuts Woman Into Pieces
Couple Cuts Woman Into Pieces (ETV Bharat)

Couple Cuts Woman Into Pieces : తమిళనాడులోని చెన్నైలో అప్పు ఇచ్చిన మహిళ తల్లిని పొట్టనపెట్టుకుంది ఓ జంట. తీసుకున్న అప్పును తీర్చేందుకు వృద్ధురాలి వద్ద ఉన్న సొమ్ము, నగలను అపహరించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేశారు. బాధితురాలి కుమార్తె ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా మొత్తం విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన విజయ(78)అనే వృద్ధురాలు కనిపించకపోవడం వల్ల ఆమె కూతురు లోగనాయకి అనేక చోట్ల వెతికింది. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో జులై 19వ తేదీన విజయ కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విజయ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా జులై 23వ తేదీన విజయ్ ఇంటి సమీపంలో ఉండే పార్థిబన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.

అయితే అతడు అప్పటికే తన ఇల్లును ఖాళీ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు, పార్థిబన్‌ మొబైల్ సిగ్నల్స్‌ను ఆరా తీశారు. అతడు విరుదు నగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులు పార్థిబన్‌, సంగీత దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎంజీఆర్ నగర్ పోలీసులు వారిని విచారించారు. ఆ సమయంలో నేరాన్ని అంగీకరించారు పార్థిబన్ దంపతులు. విజయను హత్య చేసినట్లు తెలిపారు.

ఆమె వద్ద ఉన్న నగదుతోపాటు బంగారు నగలను దోచుకున్నట్లు చెప్పారు. అనంతరం పోలీసులు వారిద్దరినీ చెన్నైకు తరలించి క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. అందులో పలు విస్మయకర విషయాలు బయటపడ్డాయి. హత్యకు గురైన విజయ కుమార్తె లోగనాయకి వద్ద పార్థిబన్ దంపతులు రూ.20 వేలు అప్పు తీసుకున్నారు. దీంతో డబ్బులు చెల్లించాలని లోగనాయకి ఒత్తిడి తెస్తోంది. అదే సమయంలో విజయ తన సూట్‌ కేస్‌లో డబ్బులు దాయడాన్ని చూసింది సంగీత.

దీంతో ఆ డబ్బు దొంగలించి లోగనాయకికి చెల్లించాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లే విజయ ఇంట్లో ఉన్న సమయంలో సంగీత వెళ్లి సూట్‌ కేసులోని డబ్బును లాక్కుంది. దీంతో విజయ గట్టిగా అరవగా, అక్కడే ఉన్న రాడ్డుతో తలపై దాడి చేసింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలిని తమ ఇంటికి తీసుకెళ్లారు పార్థిబన్ దంపతులు. అనంతరం ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కారు. ద్విచక్రవాహనంపై బస్తాను తీసుకెళ్లి ఈస్ట్ జోన్స్ రోడ్డులోని కాలువలో పడేశారు. అయితే కాలువలో ఉన్న బస్తాను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం కేకే నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details