తెలంగాణ

telangana

'ఆమె' బాడీలో 150మిల్లీ గ్రాముల వీర్యం! వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా? - Kolkata Doctor Case

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 6:26 PM IST

Kolkata Doctor Case : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలిపై సామూహిక హత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు శవపరీక్షలో తేలింది. మరోవైపు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. అధికారులు 3 బృందాలు ఏర్పడి విచారణ చేస్తున్నారు.

Kolkata Doctor Case
Kolkata Doctor Case (ETV Bharat)

Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్​జీ కార్ ప్రభుత్వాస్పత్రిలో హత్యకు గురైన జూనియర్‌ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగినట్లు మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలకత్తా హైకోర్టుకు వారు తెలిపినట్లు సమాచారం. ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు శవపరీక్షలో తేలిందని, అందువల్ల ఒకరి కంటే ఎక్కువ మందే లైంగిక దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించారు.

గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో ఉండటమే కాకుండా లైంగికదాడి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు మృతురాలి తల్లిదండ్రులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. రెండు చెవులతోపాటు పెదవులపైన కూడా గాయాలు ఉన్నాయని చెప్పారు. మెడపై కొరికిన గాయాలు దాడి తీవ్రతను చాటుతున్నాయని తెలిపారు. అయితే తమ కుమార్తెపై సామూహిక హత్యాచారం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ మిగతావారిని అరెస్ట్‌ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ విచారణ ప్రారంభించింది. భారత న్యాయసంహిత ప్రకారం వివిధ సెక్షన్ల కింద ఎఫ్​ఆర్ఐ నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ నుంచి వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన సీబీఐ బృందం కోల్​కతా వెళ్లింది. సీబీఐ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఒక బృందం ఆర్​జీ కార్‌ ఆస్పత్రిని సందర్శించి ఘటన జరిగిన రోజురాత్రి విధుల్లో ఉన్న డాక్టర్లు, సాక్ష్యులను కలిసి మాట్లాడింది. మృతురాలితోపాటు ఆరోజు విధుల్లో ఉన్న వైద్యుల కాల్‌ లిస్టు తీసుకున్నారు. రెండోబృందం ఈ కేసులో అరెస్టయిన సివిల్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ఎఫ్​ఆర్ఐను సమర్పించింది. నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసింది. మూడో బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బంగాల్​ పోలీసులతో సమన్వయం చేయనుంది.

కుటుంబానికి అండగా ఉంటామన్న రాహుల్‌ గాంధీ
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో బాధితురాలికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. వైద్యురాలిపై హత్యాచార ఘటన యావత్‌దేశం ఉలిక్కిపడేలా చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయడానికి బదులు నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్న ఆసుపత్రి, స్థానిక పరిపాలన యంత్రాంగం తీరు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని మండిపడ్డారు. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యాయని రాహుల్‌ ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వారికి న్యాయం జరగాలని కోరారు. దోషులకు కఠిన శిక్ష పడాలని రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశారు.

వైద్యురాలిపై హత్యాచారం కేసు సీబీఐకి అప్పగించండి: కలకత్తా హైకోర్టు - Doctor case handedover to CBI

ఆమెను రేప్ చేసి, చంపి హాయిగా నిద్రపోయిన నిందితుడు- చివరిసారిగా నీరజ్​ చోప్రా మ్యాచ్​ చూసి! - Kolkata PGT Doctor Murder Case

ABOUT THE AUTHOR

...view details