Bypoll Results 2025 :2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ చేతిలో ఎదురైన ఓటమికి తాజాగా బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై 61,710 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాసవాన్ గెలుపొందారు.
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో బీజేపీ ఓడిన ఏకైక నియోజకవర్గం మిల్కిపుర్. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సమాజ్వాదీ పార్టీ నేత అవధేశ్ ప్రసాద్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో మిల్కిపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య భాగమైన ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కోల్పోవడం బీజేపీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది.