తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నక్సలైట్లే మానవ హక్కుల ఉల్లంఘనదారులు​- దేశాభివృద్ధికి వాళ్లే అతిపెద్ద అడ్డంకి' - Amit Shah On Naxalism

Amit Shah On Naxalism : సమాజంలో అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు మావోయిస్టులేనని అమిత్​ షా అన్నారు. దిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు.

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Amit Shah On Naxalism
Amit Shah On Naxalism (ANI)

Amit Shah On Naxalism : సమాజంలో అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు మావోయిస్టులేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. దేశాభివృద్ధికి వారే అతి పెద్ద అడ్డంకి అని పేర్కొన్నారు. వాళ్లపై భద్రతా దళాలు ప్రమాదకరమైన ఆపరేషన్లు నిర్వహించి పెద్ద విజయాన్ని సాధించాయని అన్నారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సోమవారం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించిన అమిత్‌ షా మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని చెప్పారు. మావోయిస్టు రహితంగా దేశాన్ని మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు.

'ఛత్తీస్‌గఢ్‌ విజయం మనకు స్ఫూర్తి'
'మెరుగైన భద్రతా పరిస్థితులు కల్పించడం వల్ల గత లోక్​సభ ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 70శాతం వరకు అధికంగా ఓటింగ్ నమోదయ్యింది. రక్షణ కార్యకలాపాలు నిర్వహించే భద్రతా దళాలు ఇప్పుడు ప్రమాదకర ఆపరేషన్స్ చేపడుతున్నాయి. ఎనిమిది కోట్ల ప్రజల అభివృద్ధి, ప్రాథమిక సంక్షేమ అవకాశాలను హరించే అతి పెద్ద మానవ హక్కుల ఉల్లంఘనదారులు వారే. మోదీ ప్రభుత్వ వ్యూహం వల్లే మావోస్టుల తీవ్రవాదం హింస 72 శాతానికి తగ్గింది. ఈ ఏడాది 202 మంది మావోయిస్టులు మృతి చెందగా, మరో 723 మంది లొంగిపోయారు. 13వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారు. ఇక ఛత్తీస్‌గఢ్‌ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. అక్కడ కొందరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టిపెట్టి, భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలి.' అని అమిత్​ షా పిలుపునిచ్చారు.

'2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుతుంది'
మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని, 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారుతుందని అమిత్‌ షా అన్నారు. 'హింసాత్మక ఘటనలు 16,463 నుంచి 7700కు తగ్గాయి. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. 2010తో పోలిస్తే పౌరులు, భద్రతా దళాల మరణాలు 70 శాతం తగ్గాయి. హింసాత్మక ఘటనలు నమోదయ్యే పోలీసు స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. పదేళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్‌ నెట్‌వర్క్‌తో పాటు 15,300 సెల్‌ఫోన్‌ టవర్లను ఏర్పాటు చేశాం. 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశాం' అని అమిత్​ షా వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details