Forest Education Courses : పర్యావరణ సమతుల్యతకి అడవులే ప్రధానం. ఉన్నవాటిని పరిరక్షించి, కొత్తగా వృద్ధి చేయడం, అటవీ ఉత్పత్తులకు విలువను జోడించడానికి నిపుణుల సేవలు ఎంతో కీలకం. ఈ దిశగా మన దేశంలో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు నెలకొల్పి కోర్సులు అందిస్తున్నారు. ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ), దేహ్రాదూన్ అలాంటి సంస్థల్లో ముఖ్యమైంది. పలు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అడవులూ, పర్యావరణానికి సంబంధించి సమగ్ర అవగాహన కలిగించి, నైపుణ్యం ఉన్న మానవ వనరులను మెరికల్లా మార్చడానికి దెహ్రాదూన్లో ఎఫ్ఆర్ఐ నెలకొల్పి, కోర్సులు అందిస్తున్నారు. అలాగే అటవీ ఉత్పత్తులైన కలప మొదలైనవి సమర్థంగా వినియోగించడంపైనా మెలకువలు నేర్పుతున్నారు. వృక్ష సంపదను వృద్ధి చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలపై సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. ఈ కోర్సులు చదివినవారు సంబంధిత విభాగాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. పరీక్షలో ప్రతిభతో ప్రవేశాలు ఉంటాయి. కోర్సులు అన్నీ రెండు సంవత్సరాల వ్యవధితో అందిస్తున్నారు. ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి.
ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో చేరిన అందరూ అవకాశాలు పొందుతున్నారు. మిగిలిన కోర్సుల్లో సుమారు 65 % మందికి జాబ్స్ దక్కుతున్నాయి. ప్రతి కోర్సులోనూ జనరల్, ఎస్సీ, ఎస్టీ విభాగాల వారీ మెరిట్ విద్యార్థికి సెమిస్టర్కు రూ.13,500 చొప్పున స్కాలర్షిప్ అందిస్తున్నారు.
ఏ కోర్సుల్లో ఎవరు చేరొచ్చు? : -
ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ : -
- సీట్లు : 43
- అర్హత : బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథ్స్/జువాలజీ/ఫిజిక్స్/అగ్రికల్చర్/ఫారెస్ట్రీ వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీలో 50 % మార్కులతో ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు.
- కోర్సులో : అడవులను ఎలా పరిరక్షించాలి, ఎదురవుతోన్న ఇబ్బందులు, పట్టణాల్లో పచ్చదనం పెంచడం, చెట్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు , అడవులను వృద్ధి చేయడం ఎలా, తదితర అంశాలను తెలుపుతారు. వీరికి ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోల్లో అవకాశాలుంటాయి.
ఎమ్మెస్సీ ఉడ్సైన్స్ అండ్ టెక్నాలజీ : -
- సీట్లు : 43
- అర్హత : 50 % మార్కులతో ఎంపీసీ గ్రూపులో బీఎస్సీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ
- కోర్సులో : కర్ర, చెక్కను వివిధ ఉత్పత్తుల్లో, తయారీలో ప్రభావంతంగా ఎలా వినియోగించవచ్చో తెలుసుకోవచ్చు. వృక్ష ధర్మాలు, చెక్క, కర్రలను ఎలా పరిరక్షించాలో నేర్పుతారు. వీరికి చెక్క ఆధారిత తయారీ సంస్థల్లో అవకాశాలు వస్తాయి.
ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ : -
- సీట్లు : 43
- అర్హత : 50 % మార్కులతో బేసిక్/అప్లయిడ్ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ/అగ్రికల్చర్ లేదా బీఈ/బీటెక్ ఎన్విరాన్మెంట్ సైన్స్ చదివి ఉండాలి.
- కోర్సులో : వీరు పర్యావరణ సమస్యలు, వాటిని అధిగమించే విధానాలపై దృష్టి సారిస్తారు. జీవ వైవిధ్యం, పర్యావరణ మార్పులు, అటవీకరణ విధానాలను తెలుసుకుంటారు. ప్రపంచానికి ఎదురవుతోన్న పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను అధ్యయనం చేస్తారు. వీరికి ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.
ఎమ్మెస్సీ సెల్యులోజ్ అండ్ పేపర్ టెక్నాలజీ : -
- సీట్లు : 26
- అర్హత : కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా సైన్స్ డిగ్రీలో 50 % మార్కులతో ఉత్తీర్ణత లేదా 50 % మార్కులతో బీఈ/బీటెక్ కెమికల్/ మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
- కోర్సులో : వృక్షాల నుంచి కాగితం తయారీకి సంబంధించిన విషయాలను వీరు అధ్యయనం చేస్తారు. సాంకేతికతను వినియోగించి, అతి తక్కువ వృథాతో ఎక్కువ మొత్తంలో కాగితాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తెలుసుకుంటారు. వీరికి వస్తు తయారీ, కాగిత పరిశ్రమ, ప్యాకింగ్ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. రెండో సంవత్సరం కోర్సులో భాగంగా వీరు సెంట్రల్ పల్ప్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీపీఆర్ఐ), సహరాన్పూర్లో చదువుతారు.
అన్ని కోర్సులకూ ఎస్సీ, ఎస్టీలు అయితే 45 % మార్కులతో ఉత్తీర్ణత సరిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ కోర్సుల్లో చేరాలని అకున్నవారు కోర్సుల వారీ విడిగా అప్లై చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష జరిగే విధానం : -
- ఆఫ్లైన్లోనే పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో 2 వందల ప్రశ్నలు ఉంటాయి. వీటిని 4 విభాగాల్లో అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది.
- సోషల్ సైన్స్, సైన్స్లో ప్రాథమికాంశాల నుంచి 100
- క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, అరిథ్మెటిక్, క్వాంటిటేటివ్ రీజనింగ్, కంప్యుటేషనల్ ఎబిలిటీ, టేబుల్స్, గ్రాఫ్స్ ఇంటర్ప్రిటేషన్లో 40
- జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 30
- కాంప్రహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, వొకాబ్యులరీ, ఇడియమ్స్, గ్రామర్, మొదలైనవాటి నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఇస్తారు. వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించాలి. ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు తగ్గిస్తారు.
ముఖ్య వివరాలు : -
దరఖాస్తు : యూనివర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు వివరాలు నింపి, డౌన్లోడ్ చేసుకోవాలి.
ఎఫ్ఆర్ఐ, రిజిస్ట్రార్, దెహ్రాదూన్ పేరుతో రూ.1500 ఫీజు డీడీ జత చేసి పోస్టులో పంపాలి.
అడ్రస్: రిజిస్ట్రార్, ఎఫ్ఆర్ఐ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, దేహ్రాదూన్ -248195
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : మార్చి 31, 2025.
పరీక్ష నిర్వహించే తేదీ : మే 4, 2025.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం : తెలంగాణ రాష్ట్రంలని హైదరాబాద్.
మరింత సమాచారం కొరకు వెబ్సైట్ : http://fridu.edu.in సంప్రదించండి.
మీరు కాబోయే ఇంజనీరా? - ఈ కొత్త రంగంలో కుప్పలు కుప్పలుగా ఉద్యోగాలు!
పోస్టల్ డిపార్ట్మెంట్లో 21,413 ఉద్యోగాలు - పరీక్ష రాయకుండానే జాబ్ - చివరి తేదీ ఎప్పుడంటే?