Air India Cancelled Flights : ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 80కు పైగా విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచే పలు విమాన సేవలు రద్దు చేసింది ఎయిర్ ఇండియా. సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణంతో సెలవు పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మూకుమ్మడిగా సెలవు!
ఏఐఎక్స్ కనెక్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విలీన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి, ఎయిర్ ఇండియా సిబ్బంది పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 'ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్' తమ ఆందోళనలను గత నెలలో కంపెనీ దృష్టికి కూడా తీసుకెళ్లింది. సిబ్బందిలో అందరినీ సమానంగా చూడడం లేదని ఆరోపించింది. దీని వల్ల తమ స్థైర్యం దెబ్బతింటోందని పేర్కొంది. అయినప్పటికీ కంపెనీ నుంచి తగు స్పందన లేకపోవడం వల్ల క్యాబిన్ క్రూలోని ఒ వర్గం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ, 300 మందికి పైగా సిబ్బంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లినట్లు సమాచారం.
ప్రయాణికులకు క్షమాపణలు
అయితే అకస్మాత్తుగా విమానాలను రద్దు చేయడంపై బుధవారం ఉదయం పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్షమాపణలు చెప్పింది. ఏడు రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చని సూచించింది. లేదా రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం సెలవులో ఉన్న తమ సిబ్బందితో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.