Bus Accident In Uttar Pradesh :ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. ఆదివారం బులంద్షహర్ జిల్లాలో సేలంపుర్ ప్రాంతంలో బదాయూ - మీరట్ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. మరో 27 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో నలుగురిని మీరట్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు.
"పికప్ ట్రక్ ఘజియాబాద్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ సరైన రూట్లోనే వస్తుంది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడు. రహదారిపై బస్సును ఒక్కసారిగా తిప్పడం వల్ల బస్సు ట్రక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చాలా మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన తరువాత చాలాసేపటికి అంబులెన్స్ ఇక్కడికి చేరుకుంది. ఘటన జరిగిన చాలాసేపటి తరువాత పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. పోలీసుల నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తుంది" అని గ్రామస్థులు ఆరోపించారు.