సెంటిమెంట్ రిపీట్ కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ - కేసీఆర్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


Published : Nov 4, 2023, 3:32 PM IST
KCR Visit Konaipally Lord Venkateswara Temple Today : సిద్దిపేట జిల్లా కోనాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు సీఎం కేసీఆర్.. ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్కు ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన కేసీఆర్.. అనంతరం పూజలు చేశారు. అలయ అర్చకులు కేసీఆర్కు ఆశీర్వచనం అందించారు. అనంతరం నామినేషన్ పత్రాలపై కేసీఆర్ సంతకాలు చేశారు.
1983 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన కేసీఆర్.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తే అంతా శుభమే జరుగుతుందని.. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు చేసిన సూచనతో అప్పటి నుంచి నామినేషన్ పత్రాలకు ఆలయంలో పూజలు చేయడం కేసీఆర్ మొదలు పెట్టారు. అనంతరం ఏ ఎన్నికల్లో పోటీ చేసినా తిరుగులేని విజయం సాధించడంతో.. బరిలో నిలిచే ప్రతిసారి నామినేషన్ పత్రాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు.