Published : Dec 21, 2023, 7:30 PM IST
సింగరేణిలో కుంభకోణాలు - న్యాయ విచారణకు కూనంనేని డిమాండ్
CPI MLA Kunamneni on Singareni Mines : శాసనసభ జరుగుతున్న తీరు బాధాకరమని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఎజెండా మీద చర్చించకుండా వేరే అంశాలు తీసుకురావడం దురదృష్టకరమన్నారు. శాసనసభలో విద్యుత్ శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కూనంనేని మాట్లాడారు.
Telangana Assembly Sessions 2023 : సింగరేణి మైన్స్ మూతపడుతున్నాయని కొత్త గనులు రావడంలేదని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే సింగరేణి అనేది కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందన్నారు. సంస్థలో పెద్ద కుంభకోణాలు జరిగాయని, దీనిపై న్యాయ విచారణ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సిరులు పంచిన సింగరేణి ఎండిపోతోందని కార్మికులు తగ్గిపోతున్నారని, సింగరేణిని అభివృద్ది చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ సరైన ప్రాంతంలో కట్టలేదని, పోలవరం పూర్తి అయితే ప్లాంట్ పరిస్థితేంటో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన నష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అప్పులపై న్యాయవిచారణ వేయడాన్ని ఆయన సమర్థించారు.