మనదేశంలో మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. చాలా సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదైనా అనుమానం వచ్చినా బయటకు చెప్పటానికి సంకోచిస్తుంటారు. ఇవే సమస్యలు మరింత పెద్దగా అయ్యేలా చేస్తాయి. అందువల్ల నిర్లక్ష్యం పనికిరాదు. ఒక వయసు వచ్చాక మరింత అప్రమత్తత అవసరం. ఆయా సమస్యలను తొలి దశలోనే పట్టుకోవటానికి కొన్ని పరీక్షలు చేయించుకోవటం మంచిది.
రక్తపోటు
రక్తపోటును 20 ఏళ్ల వయసు నుంచే పరీక్షించుకోవటం ఆరంభించాలి. కనీసం ప్రతి రెండేళ్లకు ఒకసారైనా బీపీ పరీక్షించుకోవాలి.
కొలెస్ట్రాల్
20 ఏళ్లు దాటిన వారంతా ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. మొత్తం కొలెస్ట్రాల్ 200 ఎంజీ/డీసీ కన్నా తక్కువుండేలా చూసుకోవటం ఉత్తమం.
పాప్ స్మియర్
హెచ్పీవీ టీకా తీసుకున్నా 30 ఏళ్లు దాటిన వారంతా ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. దీంతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించొచ్చు.
మామోగ్రామ్
రొమ్ముక్యాన్సర్ ఆనవాళ్లను పసిగట్టే దీన్ని 40ల్లోకి అడుగుపెట్టాక ప్రతి రెండేళ్లకు ఒకసారి చేయించుకోవాలి.
దంత పరీక్ష
ఏ వయసులోనైనా దంత సంరక్షణ ముఖ్యమే. కనీసం ఏడాదికి ఒకసారైనా దంత పరీక్ష అవసరం.
ఎముక సాంద్రత
60 ఏళ్లు దాటాక ఎముక సాంద్రత, ఎముకలు గుల్లబారే పరీక్షలు చేయించుకోవటం ఆరంభించాలి.
పెద్దపేగు క్యాన్సర్
50 ఏళ్లు వచ్చాక ఒకసారి పెద్దపేగు క్యాన్సర్ పరీక్ష చేయించుకోవటం మొదలెట్టాలి. సిగ్మాయిడోస్కోపీ అయితే ప్రది ఐదేళ్లకు, కొలనోస్కోపీ అయితే ప్రతి పదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి.
చర్మ పరీక్ష
ఇంట్లో నెలకోసారైనా చర్మాన్ని నిశితంగా పరీక్షించుకోవాలి. కొత్త పుట్టుమచ్చలు, పాత మచ్చల్లో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
గ్లూకోజు
45 ఏళ్ల నుంచి ఆరంభించి, ప్రతి మూడేళ్లకు ఒకసారి గ్లూకోజు పరీక్ష చేయించుకోవాలి. బీఎంఐ 23 కన్నా ఎక్కువున్నా, ఇంట్లో ఎవరికైనా మధుమేహం ఉన్నా ఇంకాస్త ముందుగానే దీన్ని ఆరంభించాలి.
ఇవీ చదవండి: