యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు శాఖ గ్రంథాలయాన్ని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రంథాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మోత్కూర్ శాఖ గ్రంథాలయంలో దాతల నుంచి సేకరించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు.
మత్స్యగిరికి అందజేత..
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ బహుకరించిన 50 పుస్తకాలు, మోత్కూరు ప్రజా భారతి అధ్యక్షుడు కాంబోజు మహేందర్ (15 పుస్తకాలు), కవయిత్రి మర్రి జయశ్రీ (15) , మోత్కూరి సుజాత (18) , అరిగే లక్ష్మణ్ (20) , తొగిటి మనోహరా చారి (16) బహుకరించిన పుస్తకాలను గ్రంథాలయ ఛైర్మన్ కోమటి మత్స్యగిరికి అందించారు.
పఠనంతో..
పుస్తక పఠనంతోనే విజ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందని ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాఠకుల సంఖ్య పెంచడంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే దృష్టికి..
మోత్కూరు గ్రంథాలయ అభివృద్ధి అంశాలను ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. వచ్చే వారోత్సవాల వరకు ప్రత్యేక ప్రణాళికతో గ్రంథాలయాన్ని తప్పక అభివృద్ధి చేయిస్తామన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా వినూత్న రీతిలో సాహితీ కార్యక్రమాలు చేస్తున్న గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కోమటి మత్స్యగిరిని, అభివృద్ధి కమిటీని ప్రత్యేకంగా రామకృష్ణా రెడ్డి అభినందించారు.
రాక్స్ అందిస్తాం..
పుస్తకాలు భద్రపరుచుకోవడానికి మూడు రాక్స్ (అలమారాలు) అందజేస్తానన్నారు. కార్యక్రమంలో మోత్కూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు రామ్ ప్రసాద్, రాంబాబు లైబ్రరీ ఇంఛార్జీ చిలకమర్రి బాబు చారి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : తెలంగాణ సాయుధ పోరాటం మతకోణంలో చూడరాదు : బృందాకారత్