రైతుల సంక్షేమం, వ్యవసాయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా శిక్షణా కలెక్టర్ గరిమా అగర్వాల్ క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. ఆలేరు మండలంలోని కొలనుపాకలో జిల్లా వ్యవసాయాధికారి, అనురాధ, కూలీలతో కలసి అగర్వాల్ వరి నాట్లు వేసి సందడి చేశారు. ఆ పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతు చీర బోయిన మల్లేశంను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
హరితహారంలో భాగంగా రాజానగరంలో టేకు వనం పెంచుతున్న ఆరుట్ల మధుసూదన్ రెడ్డి అనుభవాలను తెలుసుకున్నారు. కందగడ్డ తండాలో ఆత్మ పథకం లో రాజశ్రీ కోళ్ల పెంపకం పట్టిన లబ్ధిదారులను కలిశారు. యూనిట్లను పరిశీలించి...కోళ్ల పెంపకంతో ఆదాయం, కుటుంబ పోషణ తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ పర్యటనలో ఏడీఏబీ వెంకటేశ్వర్లు, ఎంఏవో లావణ్య, సర్పంచ్ సుజాత, ఎంపీటీసీ సభ్యురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు.