Yadadri temple news: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి నిత్యారాధనలు, కల్యాణపర్వం కన్నులపండువగా జరిగింది. సుప్రభాతంతో మొదలైన ఆలయ కైంకర్యాలు.. వేకువజామున మేల్కొలుపు నిర్వహించాక ప్రతిష్ఠామూర్తులకు ఆలయ అర్చకులు హారతి నివేదన జరిపారు.
![Yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-23-yadadri-radhi-sadharanam-av-ts10134_23012022115150_2301f_1642918910_1011.jpg)
పాలతో అభిషేకించి తులసీ పత్రాలతో అర్చన చేశారు. స్వర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలతో అష్టోత్తరం, సుదర్శన హోమం చేపట్టారు. శ్రీ స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవం భక్తులకు కనువిందు కలిగించింది.
![Yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-23-yadadri-radhi-sadharanam-av-ts10134_23012022115150_2301f_1642918910_992.jpg)
మరోవైపు కరోనా నిబంధనల దృష్ట్యా ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. నిత్యం సందడిగా ఉండే ఆలయ పరిసరాల్లో భక్తులు లేకపోవడంతో అరగంటలోపే స్వామి వారిని దర్శనం చేసుకుని వెనుదిరుగుతున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా భక్తులకు అధికారులు లఘు దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాల అనుమతి నిరాకరించారు.
![Yadadri temple news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-23-yadadri-radhi-sadharanam-av-ts10134_23012022115150_2301f_1642918910_696.jpg)
యాదాద్రిలో మార్చి 21 నుంచి నిర్వహించనున్న మహా యాగానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మార్చి 28న శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. ఆ రోజు నుంచి గర్భాలయంలోని స్వయంభువులను భక్తులు దర్శించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
వారం రోజుల పాటు నిర్వహించనున్న శ్రీసుదర్శన నారసింహ మహాయాగం నిర్వహణకు రెండు నెలలే మిగిలి ఉండగా ఏర్పాట్లలో వేగం పెంచుతున్నారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ప్రధానాలయ పనులను పరిశీలించారు.
ఇదీ చదవండి: Errabelli at Inavolu Mallanna jatara : ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి