రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మైలారిగూడెం, సైదాపురం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులకు ఎకరాకు రూ.పదివేల పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులను నిండా ముంచేలా ఉన్నాయన్నారు. రైతుల కోసం కృషి చేస్తున్న నాయకుడిగా కేసీఆర్ ముందువరుసలో ఉంటాడని కొనియాడారు. రైతులకు సూచనలిచ్చేందుకు రైతువేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్ గౌడ్, జడ్పీటీసీ అనురాధ, పీఏసీఎస్ ఛైర్మన్ రామిరెడ్డి, వైస్ ఛైర్మన్ ఆంజనేయులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.