కొవిడ్ కారణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మార్చి 22 నుంచి రద్దయిన ఆర్జిత సేవలు 196 రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయ్యాయి. సుదర్శన నరసింహ హోమం నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, అభిషేకం అర్చనలు ఆర్జిత సేవలను ఆదివారం నుంచి అర్చకులు నిర్వహించనున్నారు. ఆర్జిత సేవలతో పాటు జోడు సేవలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు నేటి నుంచి అనుమతిస్తున్న ఆలయ అధికారులు పేర్కొన్నారు.



టిక్కెట్టు వివరాలు:
- స్వామివారి నిత్య కల్యాణోత్సవానికి 25 టికెట్లు 50 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్క టికెట్ పై ఇద్దరికి మాత్రమే ప్రవేశం.
- సుదర్శన హోమం 25 టికెట్లు 50 మందికి మాత్రమే ప్రవేశం.
- స్వామి వారి అభిషేకం, అర్చనకు 25 టికెట్లు మాత్రమే 50 మందికి ప్రవేశం ఉంటుంది.
- శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక్క బ్యాచ్లో 50 టికెట్లు వందమందికి ప్రవేశం ఉంటుంది.
- సువర్ణ పుష్పార్చన ఒక బ్యాచ్లో నలుగురికి మాత్రం ప్రవేశం ఉంటుంది.
భక్తులు మొక్కుబడిగా సమర్పించే తలనీలాల కౌంటర్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. కొండ కింద గల తులసి కాటేజ్ 100 రూములు కరోనా నిబంధనలకు అనుగుణంగా ఇవ్వబడును. ఆదివారం కావడం వల్ల యాదాద్రికి భక్తులు అధికంగా తరలివస్తున్నారు. దీనితో స్వామి వారి దర్శనానికి దాదాపు 2 గంటల నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. భక్తుల రద్దీ ఉండటం వల్ల ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపిస్తుంది. కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతించే విధంగా అధికారులు ప్రవేశమార్గంలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత