వరంగల్ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడింది. గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠాన్ని తెరాస మరోసారి తన ఖాతాలో వేసుకుంది. పోటాపోటీగా జరిగిన పోరులో... మొత్తం 66 డివిజన్లలో... 48 డివిజన్లను గులాబీ పార్టీ కైవసం చేసుకుని ఎదురేలేదని చాటింది. మేయర్ స్ధానం రేసులో పోటీ పడి... భంగపడ్డ భాజపా పది డివిజన్లతో రెండో స్ధానానికే పరిమితం కాగా... కాంగ్రెస్... నాలుగు డివిజన్లు కైవసం చేసుకుని ఉసూరుమనిపించింది. స్వతంత్రులు, ఇతరులు నాలుగు డివిజన్లలో గెలుపు బావుటా ఎగురవేశారు. 34వ డివిజన్ తెరాస అభ్యర్ధి... దిడ్డి కుమార్ స్వామి 11 , 63 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్ధి విజయశ్రీ 21 స్వల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. పక్కా పోల్ మేనేజ్ మెంట్, గులాబీ నేతల సమష్ఠి కృషి మంత్రి కేటీఆర్ నిరంతర దిశానిర్దేశం తెరాసను విజయతీరాలకు చేర్చింది. కేంద్రం నిధులు,పథకాలతో... వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేశామని...పదే పదే చెప్పే ప్రయత్నం చేసినా భాజపాను ఓటర్లు పూర్తిస్థాయిలో విశ్వసించలేదు. సరైన అభ్యర్థులు, ప్రచారంలో సరైన వ్యూహాలు లేక భాజపాకు భంగపాటు తప్పలేదు.
ఖమ్మం గుమ్మంలోనూ గుబాళించిన గులాబీ పార్టీ వరుసగా రెండోసారి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో జయకేతనం ఎగురవేసింది. 60 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 43 స్థానాలు, మిత్రపక్షం సీపీఐ గెలిచిన 2 స్థానాలతో కలుపుకుని... 45 స్థానాల్లో స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది. కాంగ్రెస్ కూటమి 12 డివిజన్లు దక్కించుకుంది. కాంగ్రెస్ 10, సీపీఎం 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎట్టకేలకు కార్పొరేషన్లో భాజపా ఒక్క స్థానంతో బోణీ కొట్టగా ఇద్దరు స్వతంత్రులు ఎన్నికల్లో తమ సత్తా చాటారు. తెరాస అభ్యర్థులు అన్ని డివినజన్లలోనూ సత్తాచాటి ఆధిక్యం కనబరిచారు. మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో పోటి తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: కలెక్టర్