కార్పొరేషన్లో విలీనమైన మొగిలిచెర్లలో రూ.4.42 కోట్లతో రహదారులతోపాటు మురుగు కాలువల నిర్మాణం పనులను చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం రెండో డివిజన్ పరిధిలోని మొగిలిచెర్లతో పాటు గోపాల్రెడ్డినగర్, పోగుల ఆగయ్యనగర్లో కార్పొరేషన్ అధికారులతో కలిసి శనివారం పర్యటించారు. రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణాన్ని పరిశీలించారు.
గ్రామంలో ఇప్పటికే రూ.2 కోట్ల నిధులను మంజూరు చేయగా గుత్తేదారులు సక్రమంగా పనులు చేయకపోవడంతో వాటిని రద్దు చేసి తిరిగి టెండర్లను పిలిచి త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు చల్లా చెప్పారు. వాటికి తోడు మరో రూ.2 కోట్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోగుల ఆగయ్యనగర్లో 86 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకోగా ఆ భూమి పట్టాదారు మత్యాస్రెడ్డితో చరవాణిలో మాట్లాడగా.. పేదల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆయన అంగీకరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాలయ్య, వరంగల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చింతం సదానందం, డీసీసీబీ డైరెక్టర్ రమేష్, రాజు, కార్పొరేషన్ ఏఈ కృష్ణమూర్తి, ఉజ్వల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు