KTR News: సివిల్స్లో 20వ ర్యాంకు సాధించి తెలంగాణలో టాపర్గా నిలిచిన శ్రీజను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. శ్రీజ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రగతిభవన్లో కేటీఆర్ను కలిశారు. సివిల్స్లో విజయం సాధించేందుకు దోహదపడిన అంశాలు, స్ఫూర్తినిచ్చిన విషయాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
తన తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ, తండ్రి ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్న నేపథ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో శ్రీజ సాధించిన విజయం స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ సందర్భంగా శ్రీజ విద్యాభ్యాసం, ప్రిపరేషన్, ఇంటర్వ్యూ సంబంధిత అంశాలపైన మంత్రి ఆమెతో మాట్లాడారు. తన తల్లి ఉద్యోగానికి వెళుతున్న సందర్భంగా చిన్నప్పటి నుంచి తను చూసిన అనుభవాలే... తనకు స్ఫూర్తిగా నిలిచాయాని శ్రీజ పేర్కొన్నారు. ఆమె స్టాఫ్నర్సుగా అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్గా మారి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో తాను చదివినట్లు శ్రీజ కేటీఆర్కు తెలిపారు. తల్లి తన ఉద్యోగ బాధ్యతలో చూపిన సేవ స్ఫూర్తితో భవిష్యత్తులో తన విధులు నిర్వహించాలని శ్రీజకు మంత్రి కేటీఆర్ సూచించారు.
సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు లభించే అతి గొప్ప అవకాశమని కేటీఆర్ అన్నారు. దీని ఆధారంగా అనేక మంది జీవితాల్లో మార్పు తేవచ్చని తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ శ్రీజని కోరారు. 218 ర్యాంక్తో సివిల్ సర్వీసెస్లో విజయం సాధించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవేడు గ్రామానికి చెందిన కంకణాల రాహుల్ రెడ్డిని సైతం మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఇదీ చదవండి: Sirivennela Passed Away: పాటల గని, విజ్ఞాన ఖని.. సిరివెన్నెల!