వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. పెళ్లైన మూడు నెలల నిండకుండానే అత్తింట్లో విగత జీవిగా మారింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పందివారిపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో నవ వధువు విజయలక్ష్మీ మృతి చెందింది.
కట్నం కోసం.. బలిచేశారు..!
మృతురాలు విజయలక్ష్మిది కోస్గి మండలం నాగారం గ్రామం. మూడు నెలల కిందట వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పందివారిపల్లెకి చెందిన యాదయ్యకిచ్చి పెద్దలు వివాహం చేశారు. పెళ్లైన నెలరోజుల వరకు దంపతులిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాతే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి విజయలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదనపు కట్నం కోసమే అత్తింటి వారు తమ కుమార్తెను చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి పోలీసులు తమకు కనీసం సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.