హాట్స్పాట్, రెడ్జోన్, కంటైన్మెంట్ జోన్లతో నల్గొండ, సూర్యాపేట జిల్లాలు నిఘా నీడలో చిక్కుకున్నాయి. వరుసగా వెలుగుచూస్తున్న కొవిడ్-19 కేసులతో రెండు జిల్లాల్లోనూ హై అలర్ట్ కొనసాగుతోంది. ఈనెల 8 తర్వాత ఇప్పటి వరకు కేసులే లేని నల్గొండ జిల్లాలో.. శనివారం ఒకటి, ఆదివారం రెండు కేసులు బయటపడ్డాయి. ఇక వారం నుంచి హడలెత్తిపోతున్న సూర్యాపేటలో మంగళ, బుధ వారాల్లో 31 కేసులు నమోదయ్యాయి. ఇలా పోటాపోటీగా వస్తున్న పాజిటివ్లతో రెండు జిల్లాల్లోనూ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రధానంగా జిల్లా కేంద్రాల్లోనే పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఒకే కుటుంబంలో ముగ్గురికి..
నల్గొండ జిల్లాలో 15 కేసులకు గానూ జిల్లా కేంద్రంలో 12, దామరచర్లలో 2, మిర్యాలగూడలో ఒక కేసు నమోదయ్యాయి. శనివారం నల్గొండ పట్టణంలోని ఓ మహిళకు వ్యాధి నిర్ధరణ కాగా.. ఆదివారం ఆమె కూతురు, కొడుకుకు వైరస్ ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యాధి బారిన పడగా.. కుటుంబ పెద్ద మాత్రం నెగిటివ్తో బయటపడ్డారు. శనివారం 23 మంది నమూనాలు పంపగా.. అందులో ఇద్దరికి పాజిటివ్, మిగతా వారందరికీ నెగిటివ్ వచ్చింది.
జిల్లా కేంద్రంలోనే అత్యధికం..
సూర్యాపేట జిల్లాలో మొత్తం 54 పాజిటివ్ కేసులకు గానూ జిల్లా కేంద్రంలోనే 43 మందిలో వైరస్ బయటపడింది. ఇప్పటి వరకు 713 మంది నమూనాల్ని పంపితే.. అందులో ఇంకా 205 నివేదికలు రావాల్సి ఉంది. ప్రభుత్వ క్వారంటైన్లలో 284 మంది.. హోం క్వారంటైన్లలో 773 మంది ఉన్నారు. సూర్యాపేట పట్టణంలో 43, నాగారం మండలం వర్ధమానుకోటలో 6, తిరుమలగిరిలో 3, నేరేడుచర్ల, ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటతో పాటు తిరుమలగిరి, నేరేడుచర్ల మండల కేంద్రాలు, ఏపూరు సహా పరిసర గ్రామాలు, మఠంపల్లి మండలం మట్టపల్లి, సింహపురి కాలనీ, రామచంద్రాపురం తండాలో రెడ్జోన్లు కొనసాగుతున్నాయి.
ఇక మూడు పాజిటివ్లు వచ్చిన తిరుమలగిరి మండల కేంద్రాన్ని రెండు కంటైన్మెంట్ జోన్లుగా విభజించి 8 బృందాలతో నిత్యం సర్వే చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ జియోట్యాగింగ్లో ఉంచగా.. ఇప్పటివరకు 17 వందల ఇళ్లల్లో ఆరున్నర వేల మందిని పరిశీలించారు.
ఇవీచూడండి: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న క్రియా స్వచ్ఛంద సంస్థ