Consumer Awareness Seminar: నాణ్యత కొనుగోలుదారుడి హక్కు అని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) హైదరాబాద్ విభాగం డైరెక్టర్ కేవీరావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే నష్టపోకుండా ముందుజాగ్రత్త పడవచ్చునని కేవీరావు తెలిపారు. నాణ్యమైన వస్తువులను పొందడం వినియోగదారుల హక్కు అని అన్నారు. కొనే ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించాలని.. ప్రకటనలకు ఆకర్షితులై మోసపోకూడదని పేర్కొన్నారు. సరైన బిల్లులు తీసుకోవాలన్నారు. ప్రతి వస్తువుపై ఐఎస్ఐ ముద్ర తప్పనిసరిగా చూడాలని సూచించారు. హాల్ మార్కింగ్ లేకుండా ఏ ఆభరణాలు కొనొద్దని కోరారు. జాగ్రత్తగా లేకుంటే అవతలి వ్యక్తి మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉందని అన్నారు.
వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800114000, 14404 నెంబర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు సరైన ప్రమాణాలు లేవు అనిపిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని లేదా బీఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: కాలనీలో కలకలం.. రాత్రిపూట ఆడవాళ్ల బట్టలు బయట కనిపిస్తే ఖతమే..!