జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ఒకటవ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులు రోడ్డు భద్రతపై వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల రచనల్లో పాల్గొనవచ్చని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆయా అంశాలపై పోటీల్లో పాల్గొనే వారు దరఖాస్తులను తమ స్వదస్తూరితో రాసి ఈనెల 15కల్లా.. తమ సమీపంలోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో అందజేయవచ్చని పేర్కొన్నారు.
రిజిస్టర్ పోస్టు ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం గచ్చిబౌలికి పంపవచ్చన్నారు. పాఠశాల గుర్తింపు కార్డుతో పాటు చిరునామా, తరగతి, పాఠశాల పేరు వంటి వివరాలు విద్యార్థులు దరఖాస్తులో పేర్కొనాలని సీపీ తెలిపారు.
పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి కింద రూ. 4 వేలు, రెండో బహుమతి రూ. 3 వేలు, మూడో బహుమతి రూ. 2 వేలు, వీటితో పాటుగా రూ. 1,000 కింద పది కన్సొలేషన్ బహుమతులు అందజేయనున్నట్టు సజ్జనార్ వివరించారు. మరిన్ని వివరాలు కోసం 040- 27853416, 7569311356 ఫోన్ నెంబర్లు, cpsocialmediateam@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చన్నారు.
ఇదీ చూడండి: క్యాన్సర్ను ఆదిలోనే గుర్తిస్తే.. అంతం చేయొచ్చు: బాలకృష్ణ