పురాతన దేవాలయాలను శిథిలావస్థ నుంచి పునరుద్ధరించేందుకు ఉపక్రమించింది రంగారెడ్డి జిల్లా నల్లమల నేచర్ ఫౌండేషన్. ఇందులో భాగంగా ఈ సంస్థ సభ్యులు.. మొయినాబాద్ మండలం వెంకటాపూర్లోని శివాలయం, పూరీ జగన్నాథ స్వామి ఆలయాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు.
ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆలయాలను ప్రతితరం ప్రతినిధులు కాపాడుతూ వచ్చారని నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కృష్ణంరాజు అన్నారు. ఈ తరంలోనే ఆలయాలన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయని.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు తమ సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది దేవాలయాలు శుభ్రం చేశామని చెప్పారు. తమ సంస్థలో 350 మంది వాలంటీర్లు ఉన్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నల్లమల నేచర్ ఫౌండేషన్ సభ్యులు గజ్జెల పాండురంగం, రమేశ్ అరుమల, మూలె రమేశ్, మద్దూరు రాజు, యాదిలాల్ సూర్యవంశీ, వెంకటేశ్ చెన్నం, పిల్లి శివ, సత్యనారాయణ, పవన్, లింగస్వామి, కలిచేటి శేఖర్, సుభాశ్ చంద్ర బోస్ తదితరులు పాల్గొన్నారు.