కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ను ప్రతీ ఒక్కరు పక్కాగా పాటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్జోన్ ప్రాంతంలో సంజయ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
వలస కూలీల విషయంలో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోవటం వల్లే కూలీలు రోడ్లపైకి వస్తున్నారన్నారు. కూలీలను పోలీసులు నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేస్తున్నారని... అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
లాక్డౌన్కు ముందు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది సమ్మె చేపట్టారని ఇప్పుడు స్వచ్ఛందంగా విధుల్లోకి వస్తామని చెబుతున్న వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు.