ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం రద్దు చేసి, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా వేయాలని సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో కరోనా టెస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేసి అందరికీ పరీక్షలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కోరారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, రైతు వేదికలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాలని నూర్జహాన్ విన్నవించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 పడకలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో వ్యాక్సిన్ కొరతను నివారించి ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'మీలో మీరు బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి'