బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్రంలో భాజపా దూసుకుపోతోందని.. మోదీ నాయకత్వానికే పట్టంకట్టాలని యువకులు భావిస్తున్నారని నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య అభిప్రాయపడ్డారు. ఈనెల 7న నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేట్ ప్రాంతంలో భాజపా బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో జరిగే ఆ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ పాల్గొంటారని పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి దేశమంతా తోడుగా ఉందని... రామజన్మ భూమికే ఆయన వన్నె తెచ్చారని అన్నారు. రైతులను కాపాడాలనే ఉద్దేశంతోనే పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా సాగు చట్టాలు తీసుకొచ్చారని తెలిపారు. సీఎం కేసీఆర్ అబద్ధపు ముఖ్యమంత్రి అని ఆరోపించారు. పేదలకు 3ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు, ఇంటికో ఉద్యోగం అని చెప్పారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కోయ సాంబశివ రావు, నర్సింహా రెడ్డి, బాలరాజు, కౌన్సిలర్ వినోద్, రామరాజు, మెడపాటి ప్రకాశ్ రెడ్డి, సుధాకర్ చారి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'సభ్య సమాజానికి కేసీఆర్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?'