మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లా వచ్చిన వారిలో ఐదుగురు వ్యక్తుల్లో వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారి నమూనాలు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి పంపించారు. వీరిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇందులో నిర్మల్ పట్టణం చింతకుంటవాడకు చెందిన ఒకరిని, ఖానాపూర్ మండలం గోడలపంపు గ్రామానికి చెందిన మరొకరు ఉన్నారు. వీరికి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురికి నెగెటివ్ వచ్చాయి.
వందల సంఖ్యలో...
జిల్లా నుంచి మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు వేల సంఖ్యలో వలస వెళ్లారు. వైరస్ ఎక్కువగా మహారాష్ట్రలోని ముంబయి, బీవండి నుంచే పెద్ద సంఖ్యలో జిల్లాకు వచ్చారు. ఖానాపూర్, కడెం, దస్తురాబాద్ మండలాలకు ఎక్కువ మంది తిరిగి వచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అధికారికంగా అనుమతి తీసుకొని వస్తున్న వారి జాబితా ఆయా మండలాల పీహెచ్సీలకు పంపిస్తున్నారు.
ఇటీవల బెంగళూరు నుంచి నిర్మల్కు వచ్చిన ఒక సాప్ట్వేర్ ఉద్యోగికి కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఒక గదిని సిద్ధం చేశారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా మా బాబును మేము బయటకు రానివ్వట్లేదని, అన్నీ గదిలోకి మేమే జాగ్రత్తలతో అందిస్తున్నామని తల్లిదండ్రులు చెప్పారు. అందరూ ఇలా బాధ్యతగా భావిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.
హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రాథమిక పరిచయస్థుల సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఇటీవల వచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు ఇంట్లోనే ఉన్నారా.. ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఎంతమందిని కలిశారనే కోణంలో విచారణ చేస్తున్నారు. నిర్మల్ పట్టణం చింతకుంటవాడకు చెందిన వ్యక్తి ముంబయి నుంచి వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని ఇంట్లోకి రానీయకపోవడంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. చింతకుంటవాడ వాసి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రావొద్దని ఎస్పీ శశిధర్రాజు సూచించారు. వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్నారు.
ఉలిక్కిపడ్డ ఖానాపూర్
ఖానాపూర్ మండలం గోడలపంపు గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటికి వచ్చారు. ఆ వ్యక్తికి సంబంధించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. గురువారం ఈ గ్రామాన్ని జిల్లా అదనపు పాలనాధికారి ఎ.భాస్కర్రావు సందర్శించారు. గ్రామంలో 252 ఇండ్లు, పశువుల పాకలు, పరిసరాలను బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారి చేయించారు. బాధితుడి కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్లోనే ఉండాలని ఆదేశించారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా, గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా ఎస్సైలు భవానిసేన్, జే.నారాయణ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.