నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన చర్ల గంగారామ్(48), కళావతి దంపతులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఫిబ్రవరి 22న చిన్న గొడవ జరిగి కళావతి తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. కళావతిని ఇంటికి రమ్మంటూ వారి కూతురి ద్వారా కుబురు పంపిన గంగారామ్.. మార్చి 2నభార్య కళావతి వాలేగాంకు వస్తుందని తెలుసుకుని తను రాకముందే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
కళావతి వచ్చి బంధువుల ఇంట్లో చుట్టుపక్కల వారి ఇళ్లల్లో ఎంత వెతికినా గంగారామ్ ఆచూకీ లభించలేదు. చివరికి మార్చి 15న భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదంటూ కళావతి ఫిర్యాదు చేసింది. శనివారం భైంసా మండలం దేహగాం గ్రామ సమీపంలోని వాగులో ఓ శవం తేలియాడుతూ ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, గ్రామస్థులు వేరువేరుగా పడి ఉన్న తల, శరీరాన్ని పరిశీలించి గంగారామ్ మృతదేహంగా అనుమానిస్తూ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
శవం కుళ్లి పోయి ఉండడం వల్ల గుర్తు పట్టడానికి వీలులేకుండా పోయింది. కాగా చెట్టుకు వేలాడుతున్న లుంగీని చూసి ఆ బట్టలు తన తండ్రివేనని చెప్పి గంగారామ్ కూతురు కుప్పకూలిపోయింది. తల్లి తండ్రి గొడవపడ్డా మళ్లీ కలుసుకుంటారనుకుంటే ఇలా జరిగిందని కన్నీరుమున్నీరుగా విలపించింది. శవం పూర్తిగా కుల్లిపోయి ఉండడం వల్ల వైద్యులు అక్కడికక్కడే శవపంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
ఇవీ చూడండి: 'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'