కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ప్రారంభించిన శ్రీరామ రక్ష అయోధ్య మహా సైకిల్ యాత్ర నిర్మల్ జిల్లాకు చేరుకుంది. సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయానికి స్వాములు శనివారం రాత్రి చేరుకోగా... ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఘన స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా అయోధ్య శ్రీరామ మందిరానికి తీసుకెళ్తున్న రెండు కిలోల వెండి ఇటుక, పాదుకలకు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

23 రోజుల్లో అయోధ్య రామ మందిరానికి చేరుకుంటామని సైకిల్ యాత్ర స్వామి వినయ్ కుమార్ తెలిపారు. రోజూ 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నట్లు వివరించారు. దశాబ్దాల హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ధర్మ దర్శనానికి 2గంటలు