అన్నదాతల ఆత్మహత్యలతో చిధ్రమవుతున్న కుటుంబాలకు రైతు స్వరాజ్యవేదిక అండగానిలుస్తోంది. 2019లో మెంటార్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించి చేయూతనందిస్తోంది. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వైద్యులు, మానవతావాదులు సహాయంతో... సదరు కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఇప్పటివరకు 30 బాధిత కుటుంబాల బాధ్యతల్ని తీసుకున్నారు.
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన నరేందర్.. అప్పుల బాధతో 2019 ఏప్రిల్ 7న ఆత్మహత్య చేసుకున్నాడు. ఊహించని పరిణామంతో.. అతడి భార్య, ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు. తండ్రి మరణంతో చిన్నారుల చదువు అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న రైతు స్వరాజ్య వేదిక సభ్యులు... కూతురు చదువు బాధ్యతలను ఓ దంత వైద్యురాలికి అప్పగించారు. ఏడాదిన్నరగా ఆ కుటుంబానికి అండగా ఉంటున్నారు.
కుటుంబానికి అండగా
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ శంకర్ అనే కౌలు రైతు... దిగుబడిరాక అప్పుల ఊబిలో చిక్కుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఓ కుమార్తె , కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం అమ్మాయి కస్తూర్బా పాఠశాలలో చదువుతుండగా కుమారుడు తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఆ కుటుంబానికి సైతం స్వరాజ్య వేదిక సభ్యులు అండగా నిలిచారు.
రోజంతా ఆ కుటుంబాలతో గడుపుతారు
ప్రతినెల ఓ ఆదివారం బాధిత కుటుంబాల సమస్యలను గ్రామ స్వరాజ్య వేదిక సభ్యులు ఆరా తీస్తారు. రోజంతా ఆ కుటుంబాలతో గడిపి... వారికి సాంత్వన కల్పిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ బాధితులకు నిత్యావసరాలు అందించి.. తామున్నామనే భరోసా కల్పించారు. మెంటార్షిప్ కార్యక్రమాన్ని వివిధ జిల్లాలకు విస్తరించాలని గ్రామ స్వరాజ్య వేదిక సభ్యులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 'ప్రొఫెసర్ సాయిబాబాను తొలగించడం హక్కుల ఉల్లంఘనే'