కొన్నిరోజులుగా కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదలతో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 550 అడుగులు దాటింది. జిల్లాలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రాజెక్టు అధికారులు సన్నాహాలు చేశారు. పెద్దఅడిశర్లపల్లిలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) పుట్టంగండి ఎత్తిపోతల నుంచి నాలుగు మోటార్లను ప్రారంభించి 2,200 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి జలాశయానికి విడుదల చేస్తున్నారు. అక్కంపల్లి జలాశయం నుంచి జులై 25 నుంచి ఉదయసముద్రానికి 858 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో పెండ్లిపాకల మిషన్ భగీరథ ప్లాంటుకు డిస్ట్రిబ్యూటరీ - 7 ద్వారా 120, జంటనగరాల తాగునీటికి కోదండాపురం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డుకు 525, కోదండాపురం, స్వాములవారి లింగోటం మిషన్ భగీరథ ప్లాంట్లకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండటం వల్ల పీఏపల్లి మండలంలోని నక్కలపెంటతండా, దుబ్బతండాల సమీపంలోని వ్యవసాయ పొలాలకు కృష్ణమ్మ చేరువవుతోంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ముందుస్తుంగా వరదలు కొనసాగుతుండటం వల్ల జంటనగరాలకై నాగార్జునసాగర్ జలాశయంలో అత్యవసర మోటార్లతో పనిలేకుండా పోయింది. ఏఎమ్మార్పీలో భాగమైన అక్కంపల్లి జలాశయం నీటిమట్టం 243.8 ఎఫ్ఆర్ఎల్కు చేరుకుందని ప్రాజెక్టు ఏఈ కె.వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు.
పెరిగిన సాగర్ నీటిమట్టం
నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం పెరుగుతుండగా.. శ్రీశైలం నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నుంచి 40,259 క్యూసెక్కుల వరదనీరు రాగా.. నీటిమట్టం క్రమంగా పెరిగి డ్యాం క్రస్టుగేట్ల వద్దకు చేరి 550.60 అడుగుల వద్ద ఉంది. సాగర్ నుంచి కేవలం ఎస్ఎల్బీసీ ద్వారా 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 23,705 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా నీటిమట్టం 851.50 అడుగుల వద్ద ఉంది.
ఇదీ చూడండి : రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్