నాగర్ కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతోంది. రెండు రోజుల క్రితం చారగొండ మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్-19 సోకిందని వైద్య శాఖ అధికారి సుధాకర్ లాల్ ధ్రువీకరించారు.
ఈ వ్యక్తి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజుల క్రితం చికిత్స తీసుకున్నాడని ఆయన తెలిపారు. అయితే వైరస్ అక్కడి నుంచి సోకిందా లేక గ్రామంలోనే.. సోకిందా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నామని సుధాకర్ పేర్కొన్నారు. గ్రామంలోని ఓ వివాహ వేడుకలో కూడా ఆ వ్యక్తి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారందరినీ, కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉండాలని ఆదేశించామని తెలిపారు.
జిల్లా ప్రజలు అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు రావొద్దని ఆయన సూచించారు. పెళ్ళిళ్ళు శుభకార్యాలకు కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రులు, వ్యాపార సముదాయం వద్ద భౌతిక దూరం పాటిస్తూ మాస్క్లు ధరించాలన్నారు. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరి షాపులో శానిటైజర్లు ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: పాముతో భార్యను చంపింది.. అందుకోసమే!