వర్షాలు ఆశాజనకంగా ఉండడం వల్ల అనుకున్నదాని కంటే ముందు రైతులకు సాగునీరు వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ వద్ద నీటి విడుదల చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 29,30 ప్యాకేజీల నుంచి నీటిని విడుదల చేశామని... ఈ ఏడు వానకాలం, యాసంగికి సమృద్ధిగా నీళ్లు అందిస్తామన్నారు. రైతులు నీళ్ల కోసం ఇష్టం ఉన్న చోట్ల కాలువలకు ఎక్కడపడితే అక్కడ గండ్లు కొట్టొద్దని... అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని హామీ ఇచ్చారు.
కేసీఆర్ కృషివల్లే తెలంగాణ ఇవాళ అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందన్నారు. కరోనా కాలంలో కూడా 30 వేల కోట్లతో మొక్కజొన్న కొనుగోలు చేశామని... రైతుబంధు కింద రూ.7,253 కోట్ల ఇచ్చారన్నారు. రైతులను ఆదుకునే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలంగాణ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం