ములుగు కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్షించారు. నూతన రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్, ఆర్ఓఎఫ్ఆర్పై చర్చించారు. ములుగులో అటవీ భూముల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్ సర్వే చేస్తున్న నేపథ్యంలో భూముల హక్కులు, యాజమాన్యంపై స్పష్టత వస్తుందని మంత్రి అన్నారు.
కొత్త రెవెన్యూ చట్టంలో రెవెన్యూ అధికారుల పరిధి, బాధ్యత, హక్కులు స్పష్టంగా పేర్కొన్నారని సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. డిజిటల్ సర్వేలో ప్రజలకు, భూ యజమానులకు ఎలాంటి అనుమానాలున్నా అధికారులు నివృత్తి చేస్తారని వివరించారు. భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి న్యాయం చేసే విధంగా ఈ చట్టం అమలు జరగనుందని మంత్రి అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్, వైస్ ఛైర్మన్ నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ప్రాజెక్టు డైరెక్టర్ హన్మంతు తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: రేపటి నుంచి పట్టభద్రుల కోటా ఎన్నికల ఓటర్ల నమోదు