మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం రహీంగూడా తండాలో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి నునావత్ శాంతి అనే మహిళ మృతి చెందింది. రహీంగూడా తండాకు చెందిన నునావత్ శాంతి కడుపు నొప్పితో బాధపడుతూ కౌడిపల్లిలోని శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ఆస్పత్రికి వెళ్లింది. ఆసుపత్రి నిర్వాహకులు, ఆర్ఎంపీ డాక్టర్ అయిన సుధాకర్ మహిళకు గర్భసంచి ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి అస్వస్థతకు గురైన శాంతి.. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స చేయించుకుని ఇంటికి రాగా.. ఆదివారం సాయంత్రం మృతి చెందింది.
ఫలితంగా శాంతి బంధువులు శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ఆస్పత్రి నిర్వాహకులు సుధాకర్పై చిలప్చెడ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్ సీఐ నాగయ్య తెలిపారు.
ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతున్న సుధాకర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మరో మహిళకూ గర్భసంచి ఆపరేషన్ చేయగా.. ఆమె సైతం అస్వస్థతకు గురైనట్లు సీఐ పేర్కొన్నారు. సుధాకర్పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న క్రియా స్వచ్ఛంద సంస్థ