మెదక్ జిల్లాలో భూనిరభ్యంతర పత్రం జారీకి రూ. కోటి పన్నెండు లక్షల లంచం కేసులో.. ఆ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ బృందానికి చంచల్గూడ జైలులో క్వారంటైన్ కేంద్రాన్ని కేటాయించారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం వల్ల అప్పటి వరకు బెయిల్ రాకపోతే నిందితులంతా... ఈ కేంద్రంలోనే ఉండనున్నారు. మరోవైపు కరోనా దృష్ట్యా నేరుగా ములాఖత్లను నిలిపివేసి ఆన్లైన్లోనే నిర్వహిస్తుండగా .. తొలి రోజు నగేశ్ ఎవరితోనూ ఆన్లైన్లో ములాఖత్ కానట్లు తెలిసింది. నగేశ్ను అరెస్ట్ చేసిన అనిశా అతడి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాల గురించి ఆరా తీసింది. అతడి పేరుతో మెదక్లోని ఓ బ్యాంకులో మాత్రమే ఖాతా ఉన్నట్లు గుర్తించింది. అందులో కేవలం మూడు లక్షలున్నట్లు తేలింది . అయితే నగేశ్ భార్య పేరిట... బోయినపల్లిలోని ఓ బ్యాంకులో లాకర్ ఉన్నట్లు అనిశాకు ఆధారాలు లభించాయి.
డబ్బు ఎక్కడ ఉంది?
నగేశ్ భార్యను లాకర్ తాళం గురించి అడిగితే మాత్రం.. ఇల్లు మారినప్పుడు ఎక్కడో పోయిందని ఆమె సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ లాకర్ను ఫ్రీజ్ చేయించిన అనిశా అధికారులు.. దాన్ని బద్దలు కొట్టాలని నిర్ణయించారు. ఇదే విషయమై బ్యాంకు అధికారులను సంప్రదిస్తే... ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి అనుమతి లభించాక లాకర్ను పగులగొట్టాలని.. అనిశా అధికారులు భావిస్తున్నారు. లాకర్ తెరిస్తే భారీ ఎత్తున సొత్తు బయటపడవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు బాధితుడి నుంచి లంచంగా రెండు విడతల్లో తీసుకున్న రూ. 40 లక్షల సొమ్ము ఎక్కడ ఉందనే అంశంపై... అనిశా ఆరా తీస్తోంది. ఆ డబ్బు గురించి ప్రాథమిక విచారణలో నగేశ్ వెల్లడించకపోవడం వల్ల మరోసారి కస్టడీకి తీసుకోవాలని యోచిస్తోంది.
అదనపు కలెక్టర్ నగేషశ్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. అనిశా ప్రధాన కార్యాలయానికి పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ వద్ద లంచం తీసుకున్నారంటూ.. కొందరు టోల్ ఫ్రీకి ఫోన్లు చేశారు. అయితే అందుకు సంబంధించిన ఆధారాల్ని చూపాలంటూ కార్యాలయ వర్గాలు సూచించాయి. ఈ ఫిర్యాదుల్లో ఎంతవరకు వాస్తవాలున్నాయనేది... అనిశా ఆరా తీయడంలో నిమగ్నమయ్యింది.
ఇదీ చదవండి: అదనపు కలెక్టర్ నగేష్ ఇంట్లో బాధితుడి సంతకంతో చెక్కులు