కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ పల్లెల్లో నాటు సారా తయారీ విజృంభిస్తోంది. నాటుసారా తయారీకి అవసరమయ్యే ముడిసరుకులు బెల్లం, పటిక రవాణా జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆబ్కారీ అధికారులు నిఘా పటిష్ఠం చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నాటు సారా తయారీకి ఉపయోగించే పటికను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
పట్టణంలో ఒక వాహనంలో పటిక తరలిస్తున్నారని సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేయగా సుమారు 6 క్వింటాళ్ల పటిక పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు. ఈమేరకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతిక్, రాజు అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మహేందర్ సింగ్ తెలిపారు.