కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదికిపైగా బడులు మూతపడ్డాయి. ఉన్నత చదువులు చదువుతున్న వారు ఆన్లైన్ క్లాసులతో కాస్త నెట్టుకొస్తున్నా.. అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతున్న పిల్లల పరిస్థితి మాత్రం దయనీయంగా తయారైంది. కుమురంభీం ఆసిఫాబాద్ వంటి ఆదివాసీ జిల్లాల్లోని పల్లెల్లో.. విద్యార్థులు ఓనమాలు మర్చిపోయే దుస్థితి ఏర్పడింది. అలాంటి చోట పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తిర్యాణి మండల పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఆదివాసీ గూడేలలో గోడలకు వర్ణమాల, అంకెలు, ఎక్కాలు పెయింటింగ్ చేయించారు. అక్కడ ఆడుకుంటున్నపుడో.. అటుగా వెళ్తున్నపుడో వాటిని చదవడం ద్వారా పిల్లలు వాటిని మర్చిపోకుండా చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు.
వైరస్తో చదువులకు దూరమైన తమ పిల్లలకు ఎస్సై ఆలోచన ఉపయోగపడుతోందని ఆయా గూడేల ప్రజలు చెబుతున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించడంపై కృతజ్ఞతలు చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల పిల్లల కోసం తమవంతు కృషి చేస్తున్న తిర్యాణి పోలీసులను అందరూ ప్రశంసిస్తున్నారు.