తెలంగాణ భాషా ఔన్నత్యాన్ని మరిచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని.. ఖమ్మం జిల్లా తెరాస నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడిననే స్థాయి మరిచి ఇష్టానుసారంగా మాట్లాడి విధ్వంసకర రాజకీయాలు చేయాలనుకుంటే.. ప్రజలే తగిన బుద్ది చెబుతారని తెలిపారు.
సంక్షేమంపై మాట్లాడకుండా ..
ఖమ్మంలో పర్యటన సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్, హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ ఛైర్మన్ కమల్ రాజు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడకుండా సీఎం, మంత్రి పువ్వాడపై వ్యక్తిగత విమర్శలకు దిగారని మండిపడ్డారు.
ఇది కరీంనగర్ కాదు , ఖమ్మం
బండి సంజయ్ రాకతో ఖమ్మం నగరం మలినమైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇష్టానుసారంగా అవాకులు, చవాకులు పేలేందుకు ఇది కరీంనగర్ కాదు ఖమ్మం అనే సంగతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గుర్తుంచుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి:రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : పొన్నాల