కరీంనగర్ జిల్లా ఆసుపత్రి కరోనా బాధితులకు వైద్యం అందించడంలో కీలక పాత్రం పోషిస్తోంది. గత ఏడాది కాలంగా వేలాది మందికి వైద్యసేవలు అందిస్తోంది. కరోనా రోగులకు వైద్యం అందించడంలో వైద్యుల పాత్రతో పాటు నర్సుల పాత్ర కీలకమైంది. వైద్యులు వార్డుల్లో రౌండ్లు కొట్టి వెళ్లి పోతుంటే రోగులను దగ్గర ఉండి వైద్యులు సూచించిన విధంగా ఇంజెక్షన్లు, ఇతరత్రా సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో కొవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కో వార్డులో 60 నుంచి 70 మంది వరకు రోగులు వైద్యం పొందుతుండగా నర్సులు మాత్రం ఇద్దరినే కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం అవుతోంది. ఎంతో కీలకమైన సేవలందించాల్సిన సమయంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నామని కంటతడి పెట్టే పరిస్థితి నెలకొంటోంది. తమపై తీవ్ర ఒత్తిడి ఉండటం. దీనికి తోడు వైద్య పరికరాల్లో లోపం కారణంగా రోగుల మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని వారు పేర్కొంటున్నారు.
డైట్ అలవెన్స్ ఎక్కడ..?
గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 3 వేలకు పైగా కరోనా బాధితులకు వైద్యం అందించగా రెండో విడతలో మాత్రం ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనితో తాము కూడా పలుసార్లు కరోనా బారిన పడిన విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నియామకాలు చేపట్టకపోయినా జిల్లాలో చాలా మంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సిబ్బంది వృథాగా ఉంటున్నారని పేర్కొన్నారు. కొవిడ్ వార్డుల్లో విధులు పనిచేసే వారికి డైట్ అలవెన్స్ ఇస్తామని ఏడాది క్రితం ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు నయాపైసా తమకు అందలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తొలి విడతలో 50లక్షల బీమా సదుపాయం కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు.
ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు మాత్రం సరైన సమయంలో అందడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సిబ్బంది ఉన్నారని.. అంతేకాకుండా ఒక్కొక్కరి రెండు పర్యాయాలు కరోన సోకిన వారు కూడా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.