ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 50 వేల మందికిపైగా మత్స్యకారులు చేపల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడం, మార్కెటింగ్, నాణ్యమైన చేపలు లభించే దిశగా అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మత్స్యకారులకు కలిసి వస్తోంది.. జీవనోపాధిని అభివృద్ధి చేసేందుకు ఉచిత చేపపిల్లల సరఫరాతో పాటు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వాహనాలు, రుణాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది.
తాగు, సాగునీటితో చేపల పెంపకం
కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టుల్లో ముఖ్యమైన సుందిళ్ల బ్యారేజీ, నంది మేడారం ప్రాజెక్టుల్లో తాగు, సాగునీటితో పాటు చేపల పెంపకాన్ని గత ఏడాది ఆగస్టు నుంచి చేపట్టింది. అన్ని జలాశయాల్లో 30 లక్షల చేప పిల్లలు పోస్తే 750 నుంచి 800 టన్నుల వరకు దిగుబడి వచ్చిందని.. ఇంకా 30 శాతం చేపలు గ్యారేజ్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాల్లో చేపల పెంపకం
- పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఉన్న అన్నారంలో 50 శాతం వాటాతో ఇరు జిల్లాల మత్స్యకారులతో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.
- ఎల్లంపల్లి ఎగువ, దిగువ మద్యమానేరులో కూడా గణనీయంగా చేపల ఉత్పత్తి సాగుతోంది.
- జగిత్యాల జిల్లాలో పెద్ద జలాశయాలు లేకపోవడం వల్ల అక్కడ చేపల పెంపకం చెరువులకే పరిమితమైంది.
బొచ్చే.. డిమాండ్ అదిరింది
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,640 చెరువుల్లో 5.81 కోట్ల చేప విత్తనాలను ఉచితంగా సరఫరా చేయగా ఇందులో ఇప్పటివరకు 27,440 టన్నుల చేపలు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్లో అధికంగా డిమాండ్ పలికే బొచ్చే, బంగారు తీగ రకాలను ఎక్కువగా పెంచుతున్నారు. చిన్న చేపల విత్తనాలను చెరువుల్లో వేస్తుండటం వల్ల పెద్ద చేపలు వీటిని ఆహారంగా తీసుకుంటున్నాయి. ఇంకొన్ని చేపలు వ్యాధుల వల్ల చనిపోవడం వల్ల దిగుబడి తగ్గుతోంది.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెరువుల వివరాలు
జిల్లా | చెరువుల సంఖ్య | సరఫరా చేసినచేప పిల్లలు | ఉత్పత్తి టన్నుల్లో | |
---|---|---|---|---|
1 | కరీంనగర్ | 769 | 1.98కోట్లు | 10,000 |
2 | పెద్దపల్లి | 1013 | 1.51 | 7240 |
3 | జగిత్యాల | 543 | 1.30 | 7200 |
4 | రాజన్నసిరిసిల్ల | 315 | 1.02 | 3000 |
- ప్రధాన జలాశయాల్లో చేపల ఉత్పత్తి వివరాలు
జలాశయాలు | చేపపిల్లలు లక్షల్లో | ఉత్పత్తి టన్నుల్లో | |
1 | దిగువ మానేరు | 30లక్షలు | 500టన్నులు |
2 | ఎల్లంపల్లి జలాశయం | 12.21 | 448 టన్నులు |
3 | పార్వతి(సుందిళ్ల)బ్యారేజి | 11.41 | 285 టన్నులు |
4 | సరస్వతి(అన్నారం) | 12.60 | 315 టన్నులు |
5 | నంది మేడారం | 6.09 | 150టన్నులు |
6 | సిరిసిల్ల మధ్యమానేరు | 28.50 | 1488టన్నులు |
7 | ఎగువమానేరు | 10.50 | 850 టన్నులు |
8 | మూలవాగు | 1.57 | 125 టన్నులు |
అధిక దిగుబడి - మంచి ధర
అత్యాధునిక కేజ్ కల్చర్తో ఫంగషీయస్ జాతి చేపలను కేవలం దిగువ మానేరులో పెంచుతున్నాం. చేపలకు కావల్సిన నీటిలో తేలియాడే ఆహారాన్ని కైకలూరు, భీమవరం ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నాం.. జలాశయం మధ్యలో జాలీలు ఏర్పాటుచేసి చేపలను ప్రత్యేక దానాతో పెంచుతున్నాం. దీని వల్ల ఎక్కువ దిగుబడి, మంచి ధర లభించే అవకాశం ఉంది.- ఖదీర్ అహ్మద్, మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్
ఇదీ చూడండి: 'మిడదల దండుపై దండయాత్రకు సిద్ధంకండి'