కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణీల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పౌష్టికాహారంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఆహార భద్రత కమిటీ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి అంగన్వాడి కేంద్రంలో కుళ్లిపోయిన కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నారని సామాజిక మాధ్యమంలో గోడు వెళ్లబోసుకున్న బాధితులకు ఫుడ్ కమిషన్ స్పందించింది.
ఈ మేరకు ఆహార భద్రత కమిటీ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ అధికారులతో కలిసి అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు నేరుగా కలిసి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాడైన గుడ్లను పంపిణీ చేస్తూ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని.. కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్టాక్ లేదంటూ గత నెల నుంచి పాలను పంపిణీ చేయడం లేదని సమాధానమివ్వగా.. పూర్తి వివరాలు సేకరించి నివేదికను సమర్పించాలని అధికారులను ఆనంద్ ఆదేశించారు.
ఇదీ చదవండి: ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!