లాక్డౌన్ నేపథ్యంలో యాసంగి ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా కామారెడ్డి జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. అలాగే ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలకు కొనుగోలు బాధ్యత అప్పగించారు. రైతుల చెంతకు వెళ్లి పంటపొలాల్లోనే కొనుగోళ్లు చేపడుతున్నప్పటికీ....ధాన్యం తరలింపులో జాప్యం నెలకొంటోంది.
వీటిపై దృష్టి సారించాలి...
- ధాన్యంలో తాలు అధికంగా ఉందంటూ బియ్యం మిల్లర్లు భారీగా కోత పెడుతున్నారు. రెండు కిలోల వరకు ‘కోత’ పెడుతుండటంతో కర్షకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
- హమాలీల కొరత తీవ్రంగా ఉంది.. గతంలో బిహార్ కూలీలు పని చేసేవారు... లాక్డౌన్ నేపథ్యంలో వారంతా సొంత రాష్ట్రం వెళ్లిపోయారు. బియ్యం మిల్లుల వద్ద ధాన్యం సంచులు లారీల నుంచి దింపడంలో జాప్యం నెలకొంటోంది.
- ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం బాగున్నా... ఎలక్ట్రానిక్ కాంటాలు లేక సాధారణ కాంటాలతోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి.
- రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే విషయంలో ప్రాథమిక సహకార సంఘాల నిర్వాహకులు ఆలస్యం చేస్తున్నారు.
మరింత వేగవంతం చేస్తాం...
ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేశాం. అదనపు కలెక్టర్ నిత్యం సమీక్షిస్తున్నారు. 40 కేంద్రాలకో అధికారిని నియమించి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాం.
- జితేంద్రప్రసాద్, డీఎం, జిల్లా పౌరసరఫరాల శాఖ