25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన అధికారులు మూడేళ్లు దాటినా వాటిని పూర్తి చేయలేకపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొలువైన కాళేశ్వరం పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులతో అసంపూర్తిగా మిగిలిపోతుంది. పర్యటకంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించినా... అధికారులు నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
మూడేళ్లుగా పూర్తికాని నిర్మాణాలు
దేవాదాయ శాఖకు రూ.3 కోట్ల వ్యయంతో 12 పనులు, పంచాయతీరాజ్ శాఖకు రూ. 18 కోట్లతో 15 పనులు, రూ. అటవీశాఖకు రూ. కోటి, ఇతర పనులకు మిగతా కేటాయించారు. ఆయా నిధులతో అనివెట్టి మండపం, 100 గదుల కాటేజీ, ప్రసాదాల తయారీ, రహదారుల విస్తరణ, ఆలయాలకు గోపురం, అభిషేక మండపం, తదితర పనులు చేపట్టాల్సి ఉన్నా... మూడు శివరాత్రులు దాటినా... నిర్మాణాలకు రూపమే సంతరించుకోవడంలేదు.
ఇవి మాత్రమే పూర్తి అయ్యాయి...
ప్రసాదాల తయారీ భవనం, ఈవో కార్యాలయం, అనివెట్టి మండపాలు, దుకాణ సముదాయాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పనులు కొనసాగుతుండగా, మరికొన్ని షురూనే కాలేదు.
స్థల సేకరణకు గ్రహణం
స్థలాభావంతో ఆలయానికి ప్రధాన ముఖద్వారం, అపరకర్మ మండపం, పార్కింగ్, డార్మేటరీ, రాజగోపురం ముందు రహదారి విస్తరణ, బస్టాండ్ నుంచి గోదావరి వరకు రహదారి విస్తరణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థల సేకరణకు నిధుల లేమి, నిర్లక్ష్యం, కొందరి ప్రమేయం, తదితర కారణాలతో స్థల సేకరణకు గ్రహణం పట్టింది. కాళేశ్వరంలో స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ జాగాలున్నా.. అటవీ, రెవెన్యూ తగాదాలు ఉన్నాయి.
దేవాదాయ శాఖ చేపట్టిన పనులు ఇలా..
సరస్వతీదేవి ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణాలు పూర్తయ్యాయి. రాజగోపురాలకు, ఇతర ఆలయాలకు తలుపులు బిగించారు. ప్రాకారంలోని విగ్రహాల ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయానికి ముందు అనివెట్టి మండపం, ప్రసాదాల తయారీ భవనం అయిపోయింది.
రామాలయం ఆవరణలో మరమ్మతులు, ప్రహరీ నిర్మాణాలు పూర్తి కాగా గుత్తేదార్ల నిర్లక్ష్యంతో గోడకు పగుళ్లు తేలగా... వాటికి పై పూతలు అద్దారు. పార్వతీ ఆలయం ముందు మండపం, కల్యాణ మండప నిర్మాణాలు 70 శాతం, సుబదా మండప నిర్మాణాలు 50 శాతం మేరకు మాత్రమే అయ్యాయి. నాలుగు ధ్వజ స్తంభాల కోసం లేఖలు అటవీ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నాయి.
పంచాతీరాజ్శాఖ చేపట్టిన నిర్మాణాలు..
ఆలయం ముందు విద్యుత్తు దీపాల అమరిక పూర్తయింది. పూర్వం నాటి వేములవాడ అతిథి గృహ నిర్మాణాలకు మరమ్మతులు పూర్తి చేసి మమ అనిపించారు. ఆలయాల చుట్టూ గోడ, కార్యనిర్వహణాధికారి కార్యాలయం, దుకాణ సముదాయాల నిర్మాణాలను పూర్తి చేశారు.
అన్నదాన సత్ర నిర్మాణాలు మండకొడిగా సాగుతున్నాయి. రూ.8 కోట్ల వ్యయంతో చేపట్టిన 100 గదుల అతిథి గృహా నిర్మాణాలు మరో రెండేళ్లైనా పూర్తయ్యే పరిస్థితే కనిపించడం లేదు.
క్యూ లైన్ నిర్మాణాలు ఈ మధ్య ప్రారంభించారు. ప్రయాణ ప్రాంగణం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు రహదారి విస్తరిస్తూ రెండు వైపులా మురుగు కాలువలు, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయాల్సి ఉండగా... స్థానిక నాయకుల మధ్య భేదాభిప్రాయాలతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఒక వైపు మాత్రమే మురుగు కాలువ నిర్మాణాలు పూర్తి చేశారు.
క్లాక్ రూం నిర్మాణాలు ఇప్పుడిప్పుడే నడుస్తున్నాయి, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పార్కు నిర్మాణాలకు అతీగతీ లేకుండాపోయింది.
కాళేశ్వరంలోని ముక్తి వనం అభివృద్ధికి నిధులు కేటాయించగా 7 పనులుగా విభజించారు. ఏ ఏ నిర్మాణాలు చేపట్టారో అధికారులకు సైతం తెలియదు.
రూ. 100 కోట్ల ప్రతిపాదనలూ లేవాయె..
ఇటీవల సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు రూ. 100 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత నిర్మాణాలు పూర్తయితే ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మలివిడత రూ.100 కోట్లకు అంకురార్పణ జరిగే అవకాశాలున్నాయి. వీటికి ఇంతవరకు ప్రతిపాదనలు లేవు.
ఇవీ చూడండి: అంపశయ్యపై అసంఘటిత రంగం.. ఆర్థికాన్ని గాడినపెట్టే చొరవేది?