జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో జంగేడు గ్రామం ఉంది. ఇక్కడి నుంచి గొర్లవీడు రోడ్డుకు లింక్ చేస్తే దాదాపు పది గ్రామాలకు రవాణా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని కోసం కోటి రూపాయల నిధులతో ఒక కిలోమీటర్ బీటీ రోడ్డుతో పాటు... జంగేడు సమీపంలోని చెలిమె వాగు వద్ద రోడ్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు.
వారం రోజులకే...
ఇటీవల తారు రోడ్డు నిర్మాణం కూడా పూర్తయ్యింది. ఈ ఆనందం స్థానికులకు వారం కూడా లేదు. 7 రోజులకే తారంతా ఊడిపోయిందని తెలిపారు. చేతితో తీసినా పెచ్చుపెచ్చులుగా వస్తోందని... పలుచోట్ల పగుళ్లు తేలి కనిపిస్తోందని అన్నారు. ఎంతో కాలంగా ఈ రోడ్డు నిర్మాణం కోసం ఎదురుచూశామని... ఇప్పుడిలా నాణ్యతా లోపంతో నిర్మించడం వల్ల ఎంతకాలం ఉంటుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూతూ మంత్రంగా మరమ్మతులు...
రహదారి నిర్మిస్తుండగానే అనుమానం వచ్చిన కొందరు స్థానికులు... అధికారులను, నిర్మాణ సిబ్బందిని నిలదీశారు. అయినా తూతూ మంత్రంగా మరమ్మతులు చేసినట్లు చేసి అలాగే వదిలేశారని అన్నారు. తారు మిశ్రమాన్ని సరైన ఉష్ణోగ్రత ఉండగా చేసినప్పుడే సరిగ్గా అది నాణ్యతగా ఉంటుందని... కానీ తారు మిశ్రమాన్ని సరిగ్గా వేడి చేయక ముందే ఈ రహదారిని నిర్మించారని ఓ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ ఏఈ దృష్టికి తీసుకెళ్లగా... రహదారిని పరిశీలించి లోపాలుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: సువేందుకు షాక్- నందిగ్రామ్లో దీదీ జయకేతనం