ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్రానికి కేంద్ర నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గాయి. గతేడాది రూ.3,841 కోట్లు రాగా... ప్రస్తుతం రూ.3,622 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి రాష్ట్రానికి పన్నుల వాటాలో ఐదు శాతానికి పైగా తగ్గుదల ఉంది. దేశవ్యాప్తంగా పన్నుల వసూళ్లు తగ్గడమే దీనికి కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కేంద్ర గ్రాంట్లలోనూ తగ్గుదల
వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లలోనూ భారీ తగ్గుదల ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో గ్రాంట్ల కింద రాష్ట్రానికి వచ్చిన నిధులు రూ.2,252 కోట్లు కాగా... ప్రస్తుతం జూన్ వరకూ కేవలం రూ.1,351.3 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి దాదాపు 39 శాతం తగ్గుదల కనిపిస్తోంది.
గతంలో సూక్ష్మం... ఇప్పుడు శూన్యం...
జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రాంట్ల రూపంలో నిరుడు రూ.939 కోట్లు రాగా... ఈ ఏడాది ఒక్క పైసా కూడా రాలేదు. జాతీయ విపత్తు నిర్వహణ నిధులు రూ.226 కోట్లు వస్తే... ఈసారి రిక్త హస్తమే మిగిలింది. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద సూక్ష్మసేద్యానికి గత ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.122 కోట్లు రాగా... ఈ ఏడాది కేంద్ర మొండి చెయ్యే చూపించింది. జాతీయ ఆరోగ్య మిషన్కు మాత్రం ఈసారి అత్యధికంగా రూ.420 కోట్లు వచ్చాయి. గ్రాంట్ల కింద సర్వశిక్షా అభియాన్కు రూ.240 కోట్లు, అమృత్ పథకానికి రూ.187 కోట్లు, ఐసీడీఎస్కు రూ.157 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.129 కోట్లు, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్కు రూ.119 కోట్లు వచ్చాయి.
18 శాతం తక్కువ
పన్నుల్లో రాష్ట్ర, కేంద్ర గ్రాంట్లు కలిపితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి మొదటి త్రైమాసికంలో రాష్ట్రానికి రూ.6,093 కోట్లు వచ్చాయి. ఈసారి కేవలం రూ.4,973 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తమ్మీద 18 శాతం తక్కువ నిధులు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. రైతుబంధు నిధులు, పింఛన్ల పెంపు వల్ల ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర నిధులు తక్కువగా రావడం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు.
ఇదీ చూడండి : భాగ్యనగరంలో స్వయం సహాయక బృందాలకు 25లక్షల రుణం..!