ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకి చెందిన రత్నరాజు అలియాస్ రాజు గతంలో 24 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడని కూకట్పల్లి ఏసీపీ సురేందర్ రావు తెలిపారు. సందీప్ కుమార్, సాయి కిరణ్ అనే మరో ఇద్దరు పాత నేరస్థులతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఈ ముగ్గురు కలిసి తాళం వేసిన ఇళ్ల వద్ద ఉదయం రెక్కి నిర్వహించి, అర్థరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడేవారని ఏసీపీ చెప్పారు. ఈ విధంగా ఈ ముగ్గురు సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 7 దొంగతనాలు చేశారని వెల్లడించారు. చోరీ చేయగా వచ్చిన సొమ్మును జల్సాలకు, విలాసాలకు వెచ్చించేవారని తెలిపారు.
కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో చోరీలకు పాల్పడటం వల్ల సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి... అరెస్ట్ చేశామని ఏసీపీ తెలిపారు. నిందితుల నుంచి పది లక్షల రూపాయల విలువైన 21 తులాల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కేజీల వెండి వస్తువులు, ఒక టీవీ, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి.. డబ్బులు కొట్టేశారు